google-site-verification=JdHF1jkqQ-qdLV09xKqoTi6x4YOWDwYgt2yiuJH6zPM SAMPOORN HINDI GRAMMER EDUCATION: vinayaka vrathakalpam-వినాయక వ్రతకల్పము

Translate

13, మార్చి 2019, బుధవారం

vinayaka vrathakalpam-వినాయక వ్రతకల్పము

                  

       వినాయక  వ్రతకల్పము

వక్రతుండ మహాకాయ...కోటి సూర్య సమప్రభ...

నిర్విఘ్నం కురుమే దేవ...సర్వకార్యేషు సర్వదా...

                  
                   శ్రీ గణపతి పూజ ద్రవ్యములు


1 .వినాయకుడి మట్టిప్రతిమ
2.మహాగణపతి పూజకు పసుపు గణపతి ప్రతిమ(పసుపు గౌరమ్మ , పసుపు వినాయకుడు అని అంటారు) 
3.పసుపు 
4.కుంకుమ 
5.అక్షతలు 
6.గంధం 
7.బియ్యం
8.రెండుదీపం కుందులు 
9.వత్తులు
10.అగ్గిపెట్టి
11.జేగంట
12.అగరబతులు 
13.మూడు ఆచమన పాత్రలు (గ్లాసులు) 
14.మూడు ఉద్ధరిణిలు(స్పూనులు ) 
15.ఆచమనాదులకోసంఒకచిన్నపళ్లెం 16.నైవాద్యానికీ,పూలు,పత్రిపెట్టుకోవడానికిమూడు         పళ్లాలు,హరతి పళ్లెం 
17.కర్పూరం
18.రెండుకొబ్బరికాయలు
19.తీర్ధంపట్టడానికి గ్లాస్
20.అరటి పళ్ళ(వీలైత వీటితో పాటు 
నాలుగురకాల పళ్ళు-వెలగపండు ఉండేలా చూసుకోండి.)
21.వివిద రకాల పుష్పాలు,పూలమాలలు
22.తమలపాకుల
23.వక్కలు 
24.రెండు యజ్నోపవీతాలు(పత్తి ని సన్నని దారంగా చేసి మధ్యమధ్యలోపసుపుకుంకుమలనుఅద్దితేయజ్ణయోపవీతాలు సిద్ధం)
24.రెండు రవిక ముక్కలు లేదా కండువాలు లేదా రూపాయ బిళ్లంతటి  పరిమాణంలో దూదిని తీసుకొని తడిపి దానికి కుంకుమ అద్దితే అవి కూడా వస్త్రాలతో సమానం)
25.చేయి తుడుచుకోవడానికి వస్త్రం. 

మధుపర్కం:ఒకచిన్నపళ్లెంలోతేనే,పెరుగు,నెయ్యి, చెరుకు రసం,కలిపిన మిశ్రమం.   
రెండు జతల తాంబులాలు:5 తమలపాకుల్లో  రెండు వక్కలు;2 అరటి పళ్ళు ,రూపాయి దక్షిణ. 
పంచామృతం:1.ఆవుపాలు2.ఆవుపారుగు3.ఆవునెయ్యి4.తేనె5.పంచదార కలిపిన మిశ్రమం.
పాలవెల్లి:పాలవెల్లికి అలంకరించేనందుకు కాడలున్న కాయలు పళ్లు(కనీసం 9)దొరికితే 21 రకాల పత్రి (లేదా  దొరికినన్ని...అందులో గరిక తప్పనిసరి)
నైవేద్యం:బెల్లం ముక్కలు,21 ఉండ్రాళ్లు లేదా మోదకాలు లేదాకుడుములు . ఇవేగాక అప్పాలు, అటుకులు, లడ్డులు,పరమాన్నం,పానకం,ఇంకా మీ యథాశక్తి మేర నైవేద్యం సిద్ధం చేసుకోవచ్చు. 
పండగరోజున...
తెల్లవారుజామునేలేచి....ఇంటిల్లోఅందరూ తలంటుస్నానం చేయాలి.ప్రతీఒక్కరూకుంకుమబొట్టుపెట్టుకోవాలి.ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మామిడాకుల తోరణాలు కట్టాలి.దేవుడి గదిలో లేదా ఇంటిలోని ఈశాన్యమూల స్థలాన్ని శుద్ధిచేసి గోమయంతో కాని..పసుపుతో కానీ అలకాలి.బియ్యం పిండితో లేదా రంగులతో ముగ్గులు వేయాలి.ఆసనం కోసం ఒక పీట వేయాలి లేదా మండపం ఏర్పాటు చేయాలి.పీట పైభాగాన పళ్ళూకాయలు  కట్టిన పాలవెల్లిని అలంకరించాలి. పీటను అలంకరించి దానిపై బియ్యం పోసి గణపతి విగ్రహాన్ని ఉంచాలి. 
        
                     మహా గణపతి పూజ
వ్రతకల్పంనిర్విఘ్నంగాజరగాలని...మీమనోసంకల్పం నెరవేరాలనికోరుకుంటూ...మండపం(పూజాప్రదేశం)ఎదురుగా పీట వేసుకుని దంపతులు లేదా పూజచేసెవారు కూర్చోవాలి. రెండుచేతులూ జోడించి గణనాథుడిని కింద శ్లోకం చదువుతూ ప్రార్ధించాలి. 

శ్లోకం:
శుక్లాం బరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే॥
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం।
అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే॥
తదేవలగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ
లక్ష్మీపతేతేంఘ్రియుగం స్మరామి
యశ్మివోవామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయో సంస్మరణాత్పుంపాం సర్వతో జయమంగళమ్




ప్రార్దన:
కిందశ్లోకంచదువుతూ...ఉంగరంవేలు,మధ్యవేలు, బోటనవేళ్లతో అక్షంతులు తీసుకోని పసుపు గణపతి
 పై వేసి నమస్కరించాలి.

సుముఖ శ్చైకదస్తశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతు ర్గణాధ్యక్షఃఫాలచంద్రో గజాననః
వక్రతుండఃశూర్పకర్ణో హేరమ్బ స్కవ్ణపూర్వజః
షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపిః
విద్యారమ్బే వివాహే చ ప్రవేశ నిర్గమే తధా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే

దీపారాధన:

కింద శ్లోకాన్ని చదువుతూ అగరుబత్తుతో కానీ...లేదా మరో చిన్నదీపంతో కానీ దీపాలను వెలిగించాలి.
దీపాల వద్ద పూలు, అక్షతలు ఉంచి నమస్కరించండి.
 
భోదీపదేవీ రూపస్త్వం,కర్మసాక్షి హ్యామిఘ్నకృత్
యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్దిదో భవ
దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు

ఆచమనం:
ఆచమన పాత్ర (గ్లాసు)లోని నీళ్లను ఉద్ధరణి(స్పూన్)తో కుడిచేతిలోకి తీసుకొని చప్పుడు కాకుండా కింది పెదవితో స్వీకరించాలి.ఇలా మూడునామాలకు చేయాలి. 

ఓంకేశవాయస్వాహా (స్త్రీలైతే"స్వాహా"పదం                    దగ్గర"నమః"అనాలి)
ఓం నారాయణాయ స్వాహా(నమః)
ఓం మాధవాయ స్వాహా(నమః)
ఉద్ధరిణితో మరోసారి నీళ్లు తీసుకొని కుడిచేతిని కడుక్కుని వస్త్రంతో తుడుచుకోవాలి.తరువాత కిందనున్న మిగతా నామాలు చదవాలి. 
ఓం గోవిందాయ నమః 
ఓం విష్ణువే నమః 
ఓం మధుసూదనాయ నమః 
ఓం త్రివిక్రమాయ నమః 
ఓం వామనాయ నమః 
ఓం శ్రీధరాయనమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః 
ఓం సంకర్షణాయ నమః 
ఓం వాసుదేవాయనమః 
ఓం ప్రద్యుమ్నాయ నమః 
ఓం అనిరుద్ధాయ నమః 
ఓం పురుషోత్తమాయ నమః 
ఓం అధోక్షజాయ నమః 
ఓం నారసింహాయ నమః 
ఓం అచ్చుతాయ నమః 
ఓం జనార్ధనాయ నమః 
ఓం ఉపేంద్రాయ నమః 
ఓం హరయే నమః 
ఓం కృష్ణాయ నమః 

భూతోచ్ఛాటన:
కింద శ్లోకాన్ని చదువుతూ అక్షతలు వాసనచూసి భార్య ఎడమచేతి పక్కనుంచి వెనక్కు వేయాలి. మిగతావాళ్ళు కుడిచేతి పక్కనుంచి వెనక్కు వేయాలి. 

ఉత్తిష్ఠంతు భూత పిశాచాఃఏతే భూమి భారకాః
ఏతేషామవిరోధేవ!బ్రహ్మకర్మ సమారభే!!

ప్రాణాయామం:
మనస్సును ఏకాగ్రం చేయడానికి,శరీరాంతర్గత నాడీశుద్హికి చేసేదే ప్రాణాయామం. ముక్కుపై మధ్యవేలు,బొటనవేలు పెట్టుకుని కింది శ్లోకాన్ని పఠించాలి. 

ఓం భూః ఓం భువః ఓం సువఃఓం మహః
ఓం జనః ఓం తపఃఓం సత్యం
ఓం తత్సవిత్వుర్వరేణ్యం భర్గోదేవస్యధీమహి ధియోయోనఃప్రచోదయాత్
ఓం మాసోజ్యోతి రపోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్

సంకల్పం:
చేతిలో అక్షతలు తీసుకొని మీ మనసులోనే స్వామివారికి మీ కోరికను నివేదించుకొని..సకుటుంబ సపరివారంగా సంకల్పం చెప్పుకోవాలి.ఒకరు చెబుతుంటే మిగతావారు అనుకరించవచ్చు. 
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ముద్దిశ్యశ్రీపరమేశ్వరప్రీత్యర్థంశుభాభ్యాo. శుభేశోభ‌నే ముహూర్తే శ్రీమ‌హ‌విష్ణోరాజ్ఞేయా ప్ర‌వ‌ర్త‌మాన‌స్య‌ అద్య బ్ర‌హ్మ‌ణఃద్వితీయ‌ప‌రార్దే,శ్వేత‌వ‌రాహ‌క‌ల్పే,వైవ‌స్వ‌త మ‌న్వంత‌రే,క‌లియుగేప్ర‌ధ‌మపాదే,జంబుద్వీపే,భ‌ర‌త‌వ‌ర్షే,బభ‌ర‌త‌ఖండే,మేరోద‌క్షిణదిగ్భాగే,శ్రీశైల‌స్య‌ప్ర‌దేశే(హైద‌రాబాద్ ప్రాంత‌వాసులు వాయువ్య ప్ర‌దేశ్ అని,తిరుప‌తి ప్రాంత‌వాసులు ఆగ్నేయప్ర‌దేశ్అని మిగ‌తా ప్రాంతవాసులుఈశాన్య‌ప్ర‌దేశేఅనిచెప్పుకోవాలి) క్రిష్ణాగోదావ‌ర్యోఃమ‌ధ్య‌దేశే స్వ‌గృహే(సొంత ఇల్లు కాని వారు వాస‌గృహే అని చెప్పుకోవాలి)స‌మ‌స్త దేవ‌తాబ్రాహ్మ‌ణ హ‌రిహ‌ర స‌న్నిధౌ అస్మిన్ వ‌ర్త‌మాన వ్య‌వ‌హ‌రిక చాంద్ర‌మానేన..........నామ సంవ‌త్స‌రే(తెలుగు సంవ‌త్స‌రం పేరు చెప్పుకోవాలి)ద‌క్షిణాయ‌నే వ‌ర్ష ఋతౌ,భాధ్ర‌ప‌ద‌మాసే,శుక్ల‌ప‌క్షే,చతుర్ధ్యాం తిథౌ,......వాస‌రే(ఏవార‌మోచెప్పుకోవాలి),........న‌క్ష‌త్ర‌ (ఈనాటిన‌క్ష‌త్ర‌మేదోచెప్పుకోవాలి)శుభ‌న‌క్షత్రే,శుభ‌యోగే,శుభ‌క‌ర‌ణ‌,ఏవంగుణ విశేష‌ణ విశిష్ఠాయాం శుభ‌తిధౌ,శ్రీమాన్ గోత్రః....... (మీగోత్రంచెప్పుకోవాలి).........నామ‌ధేయః  (ఇంటి య‌జమ‌ని పేరు లేదా పూజ‌చేస్తున్న‌వారి పేరు  చెప్పుకోవాలి),శ్రీమ‌తః......గోత్ర‌స్య‌......నామ‌ధేయ‌స్య(తిరిగి గోత్రం చెప్పి ఇంటి య‌జ‌మాని భార్య‌పేరు లేదా పూజ‌చేస్తున్న వారి భార్య‌పేరు తో పాటు మిగ‌తా కుటుంబ స‌భ్యులంద‌రి పేర్లు చెప్పుకోవాలి)ధ‌ర్మ‌ప‌త్నీ స‌మేత‌స్య(వివాహంకాని వారు పూజ‌చేస్తున్న‌ట్లైతే ధ‌ర్మ‌ప‌త్నీ స‌మేతస్య అని  చ‌ద‌వ‌న‌క్క‌ర్లేదు)
మమ స‌కుటుంబస్య క్షేమ స్దైర్య విజ‌య అభ‌య ఆయురారోగ్య ఐశ్వ‌ర్యాభివృద్ధ్య‌ర్ధం,ధ‌ర్మార్ద కామ‌మోక్ష చ‌తుర్విధ ఫ‌ల‌పురుషార్ధ సిద్ధ్య‌ర్ధం,స‌క‌ల ధ‌న‌క‌న‌క విద్యా ప్రాప్త్య‌ర్ధం,వ‌స్తువాహ‌న సమృద్ధ్య‌ర్ధం,స‌ర్వాభీష్టఫ‌ల సిద్ధ్య‌ర్ధం,పుత్ర‌పౌత్రాభి వృద్ధ్య‌ర్ధం,ఇష్ట‌కామ్యార్ధ సిద్ధ‌ర్ధ్యం,మ‌నోవాంఛాఫ‌ల‌సిద్ధ్య‌ర్ధం,స‌మ‌స్త‌దురితోప‌శాంత్య‌ర్ధం,స‌మ‌స్త మంగ‌ళావాప్త్య‌ర్ధం,వ‌ర్షేవ‌ర్షేప్ర‌యుక్త శ్రీవ‌ర‌సిద్ధ వినాయ‌క‌స్వామిదేవ‌తా ప్రీత్య‌ర్ధం క‌ల్పోక్త ప్ర‌కారేణ యావ‌చ్ఛ‌క్తి ధ్యానావాహ‌నాది షోడ‌శోప‌చార పూజాం క‌రిష్యే.అంటూ అక్ష‌త‌లు,నీళ్ళూ ప‌ళ్లెంలో వ‌ద‌లాలి.

క‌ల‌శ పూజ:
ఆచ‌మ‌నం కోసం వాడిన పాత్ర కాకుండా మ‌రో ఆచ‌మ‌న‌పాత్ర(గ్లాసు)ను క‌ల‌శ‌పూజ కోసం వినియోగించాలి.అంటే ఇదే క‌ల‌శ‌మ‌న్న‌మాట‌.కింది శ్లోకాన్ని చ‌దువుతూ క‌ల‌శాన్ని ప‌సుపు,కుంకుమ‌ల‌తో అల‌క‌రించాలి.
అదౌ నిర్విఘ్నేవ ప‌రిస‌మాప్త్య‌ర్ధం శ్రీమ‌హ‌గ‌ణాధిప‌తి పూజాం క‌రిష్యే త‌దంగ క‌లశారాధ‌నం క‌రిష్యే క‌ల‌శంపై కుడిచేతిని ఉంచి కింది శ్లోకాన్ని చెప్పాలి.
క‌ల‌శ పూజ

ఆచ‌మ‌నం కోసం వాడిన పాత్ర కాకుండా మ‌రో ఆచ‌మ‌న‌పాత్ర(గ్లాసు)ను క‌ల‌శ‌పూజ కోసం వినియోగించాలి.అంటే ఇదే క‌ల‌శ‌మ‌న్న‌మాట‌.కింది శ్లోకాన్ని చ‌దువుతూ క‌ల‌శాన్ని ప‌సుపు,కుంకుమ‌ల‌తో అల‌క‌రించాలి.

క‌ల‌శ‌స్య ముఖే విష్ణుఃకంఠే రుద్ర స‌మాశ్రితః
మూలేతత్ర‌స్ధితో బ్ర‌హ్మ మ‌ధ్యే మాతృగ‌ణా స్మృతాః
కుక్షౌతు సాగ‌రాఃస‌ర్వేస‌ప్త‌ద్వీపా వ‌సుంధ‌రా 
ఋగ్వేదోధ‌య‌జుర్వేద‌స్సామ‌వేదో హ్య‌ధ‌ర్వ‌ణః
అంగైశ్చ‌స‌హితాస్స‌ర్వే క‌ల‌శాంబు స‌మాశ్రితః

క‌ల‌శంలోని నీటిని త‌మ‌ల‌పాకుతో తిప్పుతూ కింది శ్లోకాన్ని ప‌ఠించాలి.

గంగే చ య‌మునే చైవ గోదావ‌రి స‌ర‌స్వ‌తి
న‌ర్మ‌దే సింధు కావేరి జ‌లేస్మిన్ స‌న్నిధిం కురు

కింది శ్లోకం చ‌దువుతూ క‌ల‌శంలోని నీటిని త‌మ‌ల‌పాకుతో తీసుకునివినాయ‌కుడి మీద‌,పూజ‌ద్ర‌వ్యాల‌పైన‌,పూజ‌చేస్తున్నవారిపైన‌, కుటుంబ‌స‌భ్యుల‌పైన కొద్దిగా చిల‌క‌రించాలి.

ఆయాంతు శ్రీగ‌ణ‌ప‌తి పూజార్ధం దురితక్ష‌య కార‌కాః
క‌ల‌శోద‌కేన దేవ మాత్మాన‌ల పూజాద్ర‌వ్యాణి చ సంప్రోక్ష్య‌

ఏవ‌మాత్మానంచ సంప్రోక్ష్యః

మహగణపతి ప్రాణప్రతిష్ఠ:
కింది శ్లోకాన్ని చదువుతూ పసుపు వినాయకునిపై అక్షతలు వేసి నమస్కరించాలి.
ఓం శ్రీమహగణాధిపతయే నమోనమః
ప్రాణప్రతిష్ఠాపన  ముహూర్తఃసుముహూర్తోస్తు
స్తిరోభవ వరదోభవ సముఖోభవ సుప్రసన్నోభవ స్ధిరాసనం కురు

మహగణపతి పూజ:
కింది శ్లోకాన్ని చదువుతూ పూలు తీసుకొని పసుపుగణపతికి అర్పించి నమస్కరించాలి.
గణానాంత్వా గణపతిగ్‌ం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమమ్‌
జేష్ఠరాజం బ్రహ్మణాస్పత ఆనశ్మృణృన్నూతిభిస్సీద సాదనమ్
శ్రీమహగణాధిపతయే నమః! ధ్యాయామి ధ్యానం సమర్పయామి!!
నమస్కరించాలి.

ఆవాహనం:
శ్రీమహగణాధిపతయే నమః!ఆవాహయామి ఆవాహనం సమర్పయామి!!గణపతి పై నీళ్ళు చిలకరించాలి.

రత్నసింహసనం:
శ్రీమహగణాధిపతియే నమః!నవరత్నఖచిత సింహసనం సమర్పయామి!!గణపతి పై పూలు ఉంచండి.

అర్ఘ్యం:
శ్రీమహగణాధిపతయే నమః!హస్తయో అర్ఘ్యం సమర్పయామి!గణపతి పై నీళ్ళు చిలకరించాలి.

పాద్యం:
శ్రీమహగణాధిపతయే నమః!పాదయో పాద్యం సమర్పయామి!గణపతిపై నీళ్ళు చిలకరించాలి.

ఆచమనీయం:
శ్రీమహగణాధిపతయే నమః!ముఖే ఆచమనీయం సమర్పయామి! గణపతిపై నీళ్ళు చిలకరించాలి.

ఔపచారికా స్నానం:
కొబ్బరి నీటిని పసుపు గణపతిపై చిలకరించాలి.

శ్రీమహగణాధిపతయే నమ:!ఉపచారికస్నానం సమర్పయామి!

శుద్ధోదక స్నానం:
శ్రీమహగణాధిపతయే నమ:!స్నానం సమర్పయామి!గణపతి పై నీళ్ళు చిలకరించిలి.

పున:ఆచమనీయం:
శ్రీమహగణాధిపతయే నమ:స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి!
అర్ఘ్యపాద్యాల కోసం సమర్పించిన నీళ్ళు కాకుండా మరో పాత్రలో నీటిని ఆచనీయంగా సమర్పించాలి.మనం కాళ్ళు చేతులు కడగడానికి వినియోగించే నీటిని తాగడానికి ఉపయోగించం కదా.దేవుడికీ అంతే!

వస్త్రం:
పసుపు వినాయకునికి కండువా లేదా రవికముక్క లేదా పత్తితో చేసిన వస్త్రం లేదా పువ్వు సమర్పించవచ్చు.

శ్రీమహగణాధిపతయే నమ:!వస్త్రం సమర్పయామి!


యజ్నోపవీతం:

పసుపు వినాయకునికి యజ్నోపవీతాన్ని కాని లేదా పత్తితో చేసిన యజ్నోపవీతాన్ని కాని సమర్పించాలి.

శ్రీమహగణాధిపతయయే నమ:!యజ్నోపవీతం 

సమర్పయామి!


గంధం:
పసుపుగణపతికి గంధం సమర్పించండి.
శ్రీమహగణాధిపతియే నమ:!గంధం సమర్పయామి!


అక్షతలు:
 పసుపుగణపతి పై అక్షతలు వేయండి.
శ్రీమహగణాధిపతియే నమ:!అక్షతాన్‌ సమర్పయామి!

పుష్పాలు:
కింది నామాలు చదువుతూ పసుపుగణపతి పై ఒక్కో పువ్వు ఉంచాలి.
ఓం సుముఖాయనమ:
ఓం ఏకదంతాయ నమ:
ఓం కపిలాయ నమ:
ఓం గజకర్ణకాయ నమ:
ఓం లంబోదరాయ నమ:
ఓం వికటాయ నమ:
ఓం విఘ్నరాజాయ నమ:
ఓం గణాధిపాయ నమ:
ఓం ధూమకేతవే నమ:
ఓం గణాధ్యక్షాయ నమ:
ఓం ఫాలచంద్రాయ నమ:
ఓం గజాననాయ నమ:
ఓం వక్రతుండాయ నమ:
ఓం శూర్పకర్ణాయ నమ:
ఓం హేరంబాయ నమ:
ఓం స్కందపూర్వజాయ నమ:
ఓం మహగణాధిపతయే నమ:
నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి!

ధూపం:
పసుపుగణపతికి అగరుధూపం చూపించండి.
శ్రీమహగణాధిపతయే నమ:!ధూపమాఘ్రయామి!

దీపం:
పసుపుగణపతికి చేతితో దీపం చూపించాలి.
శ్రీమహగణాధిపతయే నమ:దీపం దర్శయామి
శుద్ధాఆచమనీయం:
పసుపుగణపతికి మంచినీటిని చూపించాలి.

ధూపదీపానంతరం శుద్ధఆచమనీయం సమర్పయామి!

నైవేద్యం:
పసుపుగణపతి భక్తసులభుడు.ఈయనకు బెల్లంముక్క అరటిపండు,కొబ్బరి నైవేద్యంగా సమర్పిస్తే చాలు.
కింది శ్లోకం చదువుతూ నైవేద్యం చుట్టూ నీళ్లు చల్లాలి.
ఓం భూర్భువస్సువ:తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి:ధియోయోన:ప్రచోదయాత్‌
సత్యం త్వర్తేన పరిషించయామి
అమృతమస్తు(పసుపుగణపతి వద్ద నీళ్ళు చిలకరించాలి.)
అమృతోపస్తరణమసి(నైవేద్యం పైన నీళ్ళు చల్లాలి.)
(ఎడమచేతితో కుడిచేతిని పట్టుకుని...కింది శ్లోకాన్ని చదువుతూ కుడిచేతితో అయిదుసార్లు నైవేద్యాన్ని పసుపుగణపతికి చూపించాలి.)
శ్రీమహగణపతయే నమ:!కదళీఫల,నారికేళ సహిత గుడోపహరం సమర్పయామి!
ఓం ప్రాణాయ స్వాహ
ఓం అపానాయ స్వాహ
ఓం ఉదానాయ స్వాహ
ఓం సమానాయ స్వాహ
ఓం బ్రహ్మణే స్వాహ
మధ్యేమధ్యే పానీయం సమర్పయామి!
నీళ్ళు సమర్పించాలి.
అమృతాపిధానమసి ఉత్తరపోశానం సమర్పయామి!
నీళ్ళు చిలకరించాలి.
హస్తౌ ప్రక్షాళయామి,పాదౌ ప్రక్షాళయామి,శుద్దఆచమనీయం సమర్పయామి!
అంటూ నీళ్ళు చల్లాలి.

తాంబూలం:
ఇంతకముందు సిద్ధం చేసుకున్న రెండు తాంబూలాన్ని పసుపుగణపతికి సమర్పించాలి.
శ్రీమహగణాధిపతయే నమ:!తాంబూలం సమర్పయామి!

నీరాజనం:
హరతి ఇచ్చి కళ్లకు అద్దుకోవాలి.
శ్రీమహగణాధిపతియే నమ:!నీరాజనం సమర్పయామి!
సర్వోపచారాలు:
కిందిశ్లోకాలు చదువుతూ పసుపుగణపతిపై అక్షతలు వేయాలి.
తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహీ
తన్నోదంతి:ప్రచోదయాత్‌
వక్రతుండ మహకాయ కోటి సూర్య సమప్రభ
అవిఘ్నంకురుమే దేవ సర్వకార్యేషు సర్వదా
శ్రీమహగణాధిపతయే నమ:!మంత్రపుష్ఫం సమర్పయామి!
శ్రీమహగణాధిపతయే నమ:!ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి!
శ్రీమహగణాధిపతయే నమ:!ఛత్రమాచ్ఛాదయామి చామరం
వీచయామి,నృత్యం,దర్శయావమి,గీతం శ్రావయామి,వాద్యం ఘోషయామి,అశ్వానారోహయామి,గజానారోహయామి,శకటానారోహయామి,ఆందోళికానారోహయామి.
సమస్త రాజోపచార,శక్త్యుపచార,భక్త్యుపచారపూజా సమర్పయామి అంటూ అక్షతలు,నీళ్ళు పళ్ళెంలో వదలాలి.

అక్షతధారణ:
పసుపుగణపతి వద్ద కొన్ని అక్షతలను తీసుకొని కింది శ్లోకం చదివి శిరస్సుపై చల్లుకోవాలి.
శ్రీమహగణపతి దేవతా స్సుప్రీతస్సుప్రసన్నోవరదో భూత్వా వరదోభవతు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు
ఉత్తరేశుభకర్మణ్యవిఘ్నమస్త్వితి భవంతో బ్రువంతు
ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నవస్తు
శ్రీమహగణపతి ప్రసాదం శిరసా గృహ్ణమి

ఉద్వాసన:
పసుపుగణపతిని ఆసీనపర్చిన తమలపాకును తూర్పునకు జరిపి మళ్ళీ యధాస్దానంలో పెట్టాలి.
శ్రీమహగణాధిపతయే నమ:!గణపతిం ఉద్వాసయామి!
శ్రీమహగణాధిపతయే నమ:!యధాస్దానం ప్రవేశయామి!

శోభనార్దే క్షేమాయ పునరాగమనాయచ

(అక్షతలు వేసి నమస్కరించాలి.)ఇక్కడతో మహగణపతి పూజ అంటే పసుపుగణపతి పూజ పూర్తివుతుంది.

                       వరసిద్ధివినాయక పూజ
ఇంతవరకు మీరు పసుపుగణపతిని పూజించారు.
ఆ గణపతిని మహాగణపతి అంటారు.మట్టిగణపతిని పూజించాలి.ఈయన్నే వరసిద్ధి గణపతి అంటారు.

ప్రాణప్రతిష్ఠ:
చేతిలో పూలు,అక్షతలు తీసుకుని కింది శ్లోకం చదివి మట్టిగణపతి ప్రతిమ
పాదాల వద్ద సమర్పించాలి.
ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః
ప్రాణప్రతిష్ఠ సుముహూర్త సుముహుర్తోస్తు
స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం
తాపత్త్వం ప్రీతిభావేన ప్రతిమేస్మిన్ సన్నిధం కురు
సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీం 
పరివారసమేతం శ్రీవరసిద్ధివినాయక స్వామిన్
స్ధాపితోభవ,సుముఖోభవ,సుప్రసన్నోభవ
స్థిరోభవ,వరదోభవ ప్రసీదః ప్రసీదః ప్రసీద

ప్రార్థన:
మరోమారు మీ మనసులోనే గణనాధుడికి మీ మనోకామ్యాన్ని చెప్పుకుని శుభలాభాలు
కలుగజేయమని కోరుకుంటూ వరసిద్ధి వినాయకుడిని ప్రార్థించాలి.

ఓం భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం 
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహం భజే
ఏకదంతం శూర్పకర్ణం గజవక్రం చతుర్భుజం 
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ వరసిద్ధి వినాయకమ్

ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకమ్

ధ్యానం:
పూలు లేదా అక్షతలు తీసుకుని కింది శ్లోకం చదివి వరసిద్ధివినాయకుడి పాదాల 
వద్ద ఉంచాలి.మీ పూజను స్వీకరించమని గణనాధుడికి చేసే విన్నపమే ధ్యానం

ధ్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం
శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః!ధ్యాయామి ధ్యానం సమర్పయామి!

ఆవాహనం:
పూలు,అక్షతలు చేతిలో పట్టుకుని కింద శ్లోకాన్ని చదివి స్వామివారి పాదాల వద్ద
ఉంచాలి.మీరు అలంకరించిన మట్టిప్రతిమలో గణపతి కొలువై ఉండాలని ప్రార్థించడమే 
ఆవాహనం.

అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర
అనాథ నాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ
శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః!ఆవాహయామి!


ఆసనం:
పూలు అక్షతలు చేతిలో పట్టుకుని కింది శ్లోకాన్ని చదివి స్వామివారిపై వేయండి.
మీ ఇంటికి వచ్చిన గణనాధుడు మీరు అలంకరించిన పీటనే నవరత్నసింహాసనంగా 
భావించి ఆసీనుడు కావలసిందిగా కోరుకోవడమే ఈ శ్లోకార్థం.

మౌక్తికై:పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
శ్రీవరసిద్దివినాయకస్వామినే నమః!నవరత్నఖచిత సింహాసనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి!

అర్ఘ్యం:
ఆచమనపాత్రలోని నీటిని పుష్పంతో లేదా తమలపాకుతో తీసుకునికింది శ్లోకం చదివి గణపతి చేతులపై కొద్దిగా చల్లాలి.ఇంటికి వచ్చినఅతిథికి చేతులూ కాళ్లు కడుక్కోమని నీళ్లు ఇస్తామే.అదే అర్ఘ్యం.

గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం
శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః!హస్తయో అర్ఘ్యం సమర్పయామి!

పాద్యం:
కింది శ్లోకాన్ని చదివి ఆచమనపాత్రలోని నీటిని పుష్పంతో లేదా తమలపాకుతో తీసుకుని గణపతి పాదాలపై కొద్దిగా చల్లాలి.ఇంటికి వచ్చిన అతిధికి కాళ్లు కడుక్కోమని నీళ్లు ఇస్తామే..అదే పాద్యం.

గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక
భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన
శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః!పాదయోఃపాద్యం సమర్పయామి!

ఆచమనీయం:
నీటిని పుష్పంతో లేదా తమలపాకుతో తీసుకుని కింది శ్లోకాన్ని చదివిగణపతి ముఖారవిందంపై కొద్దిలా చల్లాలి. స్వామివారికి చేసే సర్వోపచార సేవల్లో ఆచమనీయం ఒకటి.

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజితః
గృహాణాచమనం దేవః తుభ్యం దత్తం మయా ప్రభో
శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః!ముఖే ఆచమనీయం సమర్పయామి!

మధుపర్కం:
గణపతికి తేనే,పెరుగు,నెయ్యి కలిపిన మిశ్రమాన్ని కింది శ్లోకాన్ని చదివి సమర్పించాలి.మీ ఇంటికి అతిధివస్తే టీ,కాఫీలు ఇస్తారే అలాగే మన ఇంటికి వచ్చిన అతిధికి ఇచ్చే పదార్థమే మధుపర్కం.ఇది అమృతసమానం.

దదిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం
మధుపర్కం గృహాణెళిదం గజవక్ర్త నమోస్తుతే
శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః!మధుపర్కం సమర్పయామి!

పంచామృతస్నానం:
గణనాధుడికి విగ్రహంపై కొద్దిగా పాలు,పెరుగు,నెయ్యి,తేనె,పంచదార కలిపిన పంచామృత 
మిశ్రమాన్ని చిలకరించాలి.మన ఇంటికి అన్నివిఘ్నాలు తొలగించే దేవుడు వస్తే మంగళస్నానం
చేయించాలి కదా.అందుకే సర్వశ్రేష్ఠమైన పంచామృతాలతో చేయించే మంగశస్నానమే పంచామృతం.

స్నానం పంచామృతైర్దేం గృహాణ గణనాయక
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణి గణపూజితః
శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః!పంచామృతస్నానం సమర్పయామి!

శుద్థోదకస్నానం:
గణనాధుడి విగ్రహంపై తమలపాకుతో కొద్దిగా నీళ్ళు చిలకరించాలి.పంచామృతాలతో నిండిపోయిన స్వామివారి రూపంమనకు స్పష్టంగా కనిపించాలి కదా..అందుకే మళ్ళీ శుద్దోదకంతో స్నానం చేయిస్తున్నామన్నమాట.మన ఇంటిలో ఉన్ననీరే సర్వనదీజలాల సమాంగా భావించమని స్వామిని వేడుకుంటున్నాం.

గంగానది సర్వతీర్థేభ్య అహృతైరమలైర్జలైః
స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే
శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః!శుద్థోదకస్నానం సమర్పయామి! 

వస్త్రం:
కింది శ్లోకాన్ని చదివి రవికముక్క లేదా కండువా లేదా పత్తితో చేసిన వస్త్రం లేదా రెండు పుష్పాలను కానీ వినాయకుడికి 
సమర్పించాలి.ఇంటికి వచ్చిన గణనాధుడిని కొత్తబట్టలతో సత్కరిస్తున్నామన్నమాట.

రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యం చ మంగళం
శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ
శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః!వస్త్రయుగ్మం సమర్పయామి!

యజ్ఞోపవీతమ్:
కింది శ్లోకాన్ని చదివి యజ్ఞోపవీతాన్ని లేదా పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్ని కానీ లేదా తెల్లటి పుష్పాన్ని స్వామివారికి 
సమర్పించాలి.వేదాలకు అధిపతియైన గణనాధుడికి శాస్త్రానుసారం యజ్ఞోపవీతం సమర్పించడం శుభప్రదం.

రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనంచోత్తరీయకం
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక
శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః!యజ్ఞోపవీతం సమర్పయామి

గంధం:
కింది శ్లోకాన్ని చదివి చందనంలో ఒక పుష్పాన్ని ముంచి ఆ పువ్వును గణపతి పాదాల వద్ద ఉంచండి.లేదా స్వామివారి
విగ్రహానికి తడిగంధాన్ని రాయండి.అంతేకాని స్వామివారి ముఖంపై గంధం చల్లకూడదు.ఓ గణనాధా!మమ్మల్ని చల్లగాచూడు స్వామి అంటూ వేడుకోవడమే గంధ సమర్పణం.

చందనాగురకర్పూర కస్తూరీ కుంకుమాన్వితం
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః!గంధాన్ ధారయామి!

అక్షతలు:
కింది శ్లోకాన్ని చదివి గణనాధుడి పాదాల వద్ద  అక్షతలు చల్లాలి.అక్షతలు అంటే శుభాన్ని చేకూర్చేవి.క్షయం కానివి.
అటువంటి జీవితాన్ని ప్రసాదించు స్వామి అని గణనాధుడి కి సమర్పించేవే అక్షతలు.

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే 
శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః!అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి!

పుష్పాలు:
కింది శ్లోకాన్ని చదివి స్వామివారి విగ్రహానికి పూలు సమర్పించాలి.మాలను వేయాలి.ఇంటికి వచ్చిన స్వామి శోభాయమానంగా కనిపించాలి కదా.....అందుకే పుష్పాలంకరణ.
సుగన్ధాని చ సుపుష్పాణి జాజీకుందముఖాని చ
ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే 
శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః!పుష్పాణి పూజయామి!

అథాంగ పూజ:
కింద ఉన్న నామాలను చదువుతూ అందులో పేర్కొన్న విథంగా విఘ్నేశ్వరుడి దేహాన్ని అక్షతలతో పూజించాలి. గణనాధుడు సర్వశ్రేష్టుడు.మనలోనూ భగవంతుడున్నాడని అనుకుంటే ...మన శరీరమే ఒక దేవాలయం. అందుకే గణనాధుడి సర్వాంగాలను పూజించడమంటే.అత్మ పరమాత్మ వేరుకాదు అనే భావనతో భగవంతుడిని అర్పించడం.

ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి(పాదాలు)
ఓం ఏకదంతాయ నమఃగుల్భౌ పూజయామి(మడిమలు)
ఓం విఘ్నరాజాయ నమః జానుని పూజయామి(మోకాళ్ళు)
ఓం కామారిసూననే నమః జంఘే పూజయామి(పిక్కలు)
ఓం ఆఖువాహనాయ నమః ఊరూ పూజయామి(తొడలు)
ఓం హేరంబాయ నమః కటిం పూజయామి(వెనుకభాగం)
ఓం లంభోదరాయ నమః ఉదరం పూజయామి(బొజ్జ)
ఓం గణనాధాయ నమః నాభిం పూజయామి(బొడ్డు)
ఓం గణేశాయ నమః హృదయం పూజయామి(రొమ్ము)
ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి(గొంతు)
ఓం స్కంధాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి(భుజములు)
ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి(చేతులు)
ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి(ముఖము)
ఓం విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి(కనులు)
ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి(చెవులు)
ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి(నుదురు)
ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి(శిరస్సు)
ఓం శ్రీగణాధిపాయ నమః సర్వాణ్యాంగాని పూజయామి(శరీరమంతటా)

ఏకవింశతి పూజ:
ముందుగా సిద్ధం చేసుకున్న 21 రకాలు లేదా దొరికినన్ని పత్రాలతో గణనాధుడిని పూజించాలి.మరే ఇతర దేవతల వ్రతవిధానంలోనూ పత్రిపూజకనిపించదు. కేవలం వినాయకుడి వ్రతంలోనే ఈ ప్రత్యేకత.ప్రకృతి స్వరూపుడైన వినాయకుడ్ని ప్రకృతిలో లభించే 21 రకాల పత్రాలతో ఆరాధించడమే ఏకవిశంతిపూజ.ఈ పూజకు ఉపయోగించే పత్రాల్లో అనేక భౌతికమైన,ఆరోగ్యపరమైన ప్రయోజనాలే కాకుండా ఏన్నో దైవపరమైన రహస్యాలు దాగి ఉన్నాయి.
ఆయురారోగ్యాలు ప్రసాదించమని గణనాధుడిని ప్రార్థించడమే ఏకవింశతి పూజలోని పరమార్థం.

ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి(మాచిపత్రం)
ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి(వాకుడాకు)
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి(మారేడు)
ఓం గజాననాయ నమః దూర్వాయగ్మం పూజయామి(గరిక)
ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి(ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి(రేగు)
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి(ఉత్తరేణి)
ఓం గజకర్ణకాయ నమః తులసిపత్రం పూజయామి(తులసి)
ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి(మామిడాకు)
ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి(గన్నేరు)
ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి(విష్ణుక్రాంత)
ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి(వావిలాకు)
ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి(జాజిమల్లెఆకు)
ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి(గండలి,గడ్డిగరిక)
ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి(జమ్మిఆకు)
ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి(రావి ఆకు)
ఓం సురాసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి(మద్ది ఆకు)
ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి(జిల్లేడు ఆకు)
ఓం శ్రీగణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రై పూజయామి (మిగిలిన పత్రులను వేయాలి)

శ్రీవినాయకఅష్టోత్తర శతనామావళి
పూలు లేదా అక్షతలు తీసుకుని కింద నామాలు చదువుతూ వరసిద్ధివినాయకుడి పూజించాలి.ఒక్కో పువ్వు వేస్తే శ్రేష్టం లేదా గులాబీరెక్కలు వేయండి లేదా అక్షతలతో పూజించినా గణపతి సంతోషిస్తాడు.

                        శ్రీవినాయక అష్టోత్తర శతనామావళి
ఓం గజాననాయ నమః              
ఓం గణాధ్యక్షాయ నమః            
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబకర్ణాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః
ఓం మహోదరాయ నమః
ఓం మహోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళస్వరూపాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః
ఓం బలోత్ధితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరక్షిప్తవారిణే నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరక్షిప్తవారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకరప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపన్యాసాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిద్ధియే నమః
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థ పనసప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం బ్రహ్మవిద్యాధిపాయ నమః
ఓం విష్ణువే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం జితమన్మథాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం జ్యాయనే నమః
ఓం యక్షకిన్నరసేవితాయ నమః
ఓం గంగాసూతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్టవరదాయనే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మణే నమః
ఓం సఖ్యే నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాతకారిణే నమః
ఓం విశ్వక్ దృశే నమః
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం ఆక్రాన్తచిదచిత్ర్పభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
ఓం శ్రీ గణేశాయ నమః
               ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః అష్టోత్తర శతనామపూజాం సమర్పయామి
*******************************************************
ధూపం:
కింది శ్లోకాన్ని చదివి వినాయకుడికి గుగ్గిలం,సాంబ్రాణి వేసిన ధూపమూ లేదా అగరబత్తీలు చూపించాలి.
గుగ్గిలం లేదా అగరబత్తులు తిప్పకండి.ఒకచేత ధూపాన్ని పట్టుకుని కుడిచేతితో వినాయకుడికి చూపించండి.

దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం
ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదోభవ
శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః!ధూపమాఘ్రయామి!

దీపం:
కింది శ్లోకాన్ని చదివి వినాయకుడికి దీపాన్ని దర్శింపజేయాలి.
సాజ్యంత్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే
శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః!దీపం దర్శయామి!

నైవేద్యం:
ఒక పళ్లంలో అరటిఆకు వేసి మీరు సిద్ధం చేసిన ఆహారపదార్ధాలను,ఉండ్రాళ్లను అందులో ఉంచి,గణపతి ముందు పీటకాని లేదా ముగ్గుకాని వేసి ఆ మహానైవేద్య పళ్ళాన్ని స్వామివారి ముందు ఉంచాలి.ఇంకో పళ్ళంలో ఫలాలు ఉంచాలి.కొబ్బరికాయలను కొట్టి నివేదించాలి. నేరుగా నేలపై పెట్టకూడదు.కింది శ్లోకాలను చదువుతూ స్వామివారికి మహానైవేద్యంచూపించాలి.

ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం 
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
 అని నైవేద్యం పై పుష్పంతో నీళ్లు చల్లాలి.

ఓం సత్యంత్వర్తేన పరిషించయామి
 నైవేద్యం చుట్టూ నీళ్లు చల్లాలి.

ఓం అమృతమస్తు 
స్వామివారి దగ్గర నీళ్ళు చల్లాలి.

ఓం అమృతోపస్తరణమసి
అని నైవేద్యం చుట్టూ మళ్ళీ నీళ్లు చల్లి  ఈ కింది మంత్రాలు చదువుతూ ఎడమచేతితో కుడిచేతిని పట్టుకుని.............కింది శ్లోకాన్నిమంత్రాలనుచదువుతూ కుడిచేతితో అయిదుసార్లు నైవేద్యాన్ని స్వామివారికి చూపించాలి.

సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్
నైవేద్యం గృహ్యతం దేవచణముద్గైః ప్రకల్పితాన్
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయ మేవ చ
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక
శ్రీ వరసిద్ధివినాయకస్వామినే నమః!మహానైవేద్యం సమర్పయామి!
ఓం ప్రాణాయ స్వాహా
ఓం అపానాయ స్వాహా
ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా
ఓం సమానాయ స్వాహా
ఓం బ్రహ్మాణే స్వాహా
మధ్యేమధ్యే పానీయం (నీళ్ళు సమర్పించాలి).
అమృతాపిథానమసి ఉత్తరపోశానం సమర్పయామి!
నీళ్ళు చిలకరించాలి.

హస్తౌ ప్రక్షాళయామి,పాదౌ ప్రక్షాళయామి,శుద్ధ ఆచమనీయం సమర్పయామి!
అంటూ నీళ్ళు చల్లాలి.

తాంబూలం:
భోజనం చేశాక స్వామివారికి తాంబూలం ఇస్తే సంతోషిస్తాడు కదా.అందుకే మనం కూడా ఈ కింది శ్లోకాన్ని చదివి తాంబూలాన్ని స్వామి వారి వద్ద సమర్పిద్దాం.
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః!తాంబూలం సమర్పయామి!

పుష్పం:
కింది శ్లోకాన్ని చదివి స్వామివారికి పుష్పాన్ని సమర్పించండి.నన్ను అనుగ్రహించడానికి వచ్చిన స్వామి...నీ కరుణ ఎప్పటికి నా పై ఉండుగాక అని పుష్పాలు సమర్పించండి.

సదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ
భూమ్యాంస్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక
శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః!సువర్ణపుష్పం సమర్పయామి!

నీరాజనం:
లేచి నిల్చుని ఈ కింది శ్లోకాన్ని చదివి స్వామివారికి కర్ఫూర మంగళహారతులు ఇవ్వండి.

ఘృతవర్తిసహాస్తైశ్చ కర్పూరశకలైస్తథా
నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ
సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః యాచనోగృహే
లక్ష్మీరాస్ట్ర్యయాముఖే తయామాసగ్ం సృజామసి
సంతత శ్రీ రస్తు సమస్త సన్మంగళానిభవంతు
నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 
శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః!నీరాజనం సమర్పయామి!
పుష్పంతో హారతిపళ్ళెం పై నీళ్లు చల్లి హారతిని అందరూ కళ్ళకు అద్దుకోవాలి.

నీరాజనమనతరం...శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్వామివారిపై పువ్వుతో నీళ్ళు చిలకరించండి.

దూర్వాయుగ్మపూజ:
కింది నామాలను చదువుతూ...ఒక్కో నామానికి ఒక్కో జత గరికను స్వామివారికి సమర్పించండి.ఏకవింశతి పత్రపూజ 
అయిపోయింది కదా...మళ్ళీ గరికపూజ ఏమిటి అని అనుకోవచ్చు.గణపతి దూర్వాప్రియుడు.ఆయనకు గరిక అంటే చాలాఇష్టం.మీరు ఇంతవరకు తెలిసోతెలియకో ఏమైనా తప్పులు చేసి ఉంటే,"స్వామీ ఈ గరికను స్వీకరించి మా తప్పులను పరిహరించు"అని చేసే విన్నపమే ఈ దూర్వాయుగ్మపూజ.చూశారా,,గరికను సమర్పిస్తే ప్రసన్నుడయ్యే స్వామి వినాయకుడు.
ఓం గణాధిపాయ నమఃదూర్వాయుగ్మం పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమఃదూర్వాయుగ్మం పూజయామి
ఓం ఆఖువాహనాయ నమఃదూర్వాయుగ్మం పూజయామి
ఓం వినాయక నమఃదూర్వాయుగ్మం పూజయామి
ఓం ఈశపుత్రాయ నమఃదూర్వాయుగ్మం పూజయామి
ఓం సర్వసిద్ధిప్రదాయ నమఃదూర్వాయుగ్మం పూజయామి
ఓం ఏకదంతాయ నమఃదూర్వాయుగ్మం పూజయామి
ఓం ఇభవక్త్రాయ నమఃదూర్వాయుగ్మం పూజయామి
ఓం మూషికవాహనాయ నమఃదూర్వాయుగ్మం పూజయామి
ఓం కుమారగురవే నమఃదూర్వాయుగ్మం పూజయామి
ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమఃదూర్వాయుగ్మం పూజయామి

మంత్రపుష్పం:
కిందిశ్లోకాన్ని చదివి పూలు అక్షతలు స్వామివారికి సమర్పించండి."ఓ భగవంతుడా!నువ్వు విగ్రహంలోనే కాదు నాలోనూ ఉన్నావు.అందుకే నాలో ఉన్న నువ్వు నిత్యం నాకు సుఖశాంతులు ప్రసాదించి సన్మార్గంలో నడిపించు స్వామి"అంటూ చేసే నివేదనే ఈ మంత్రపుష్పం.

గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర విఘ్ననాశన
వినాయక ఈశతనయ సర్వసిద్ధి ప్రదాయక
ఏకదంతైకవదన తథా మూషికవాహన
కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్
తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి
తన్నోదంతిఃప్రచోదయాత్
శ్రీవరసద్ధివినాయకస్వామినే నమః!మంత్రపుష్పాంజలిం సమర్పయామి!

ప్రదక్షిణ:
పువ్వులు అక్షతలు తీసుకుని లేచి నిల్చుని కింది శ్లోకాన్ని చదువుతూ స్వామివారికి ఆత్మప్రదక్షిణ నమస్కారాలు సమర్పించాలి.పూలు అక్షతలు వేశాక స్వామివారి ముందు సాష్టాంగ నమస్కారం చేయాలి.పురుషులైతే పూర్తిగా సాష్టాంగపడాలి.
స్త్రీలైతే మోకాళ్లపై సాష్లాంగ నమస్కారం చేయాలి.

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ
నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రవిశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మోహం పాపాత్మ పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష గణాధిప 
శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః!
ఆత్మప్రదక్షిణం,సాష్టాంగనమస్కారాన్ సమర్పయామి!

పునఃఅర్ఘ్యం:
కింది శ్లోకాన్ని చదివి మూడుసార్లు పుష్పంతో గణపతికి నీళ్లు సమర్పించాలి.
అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక
గంధపుష్పాక్షతైర్యుక్తం ప్రాతస్థం పాపనాశన

ప్రార్థన:
సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత మళ్లీ యథాస్ధానంలో కూర్చుని పువ్వులు అక్షతలు తీసుకోవాలి.
కింది శ్లోకాన్ని చదివి గణనాధుడి పాదాల వద్ద ఉంచి నమస్కరించాలి.

నయస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన
ఈప్సితంమే వరం దేహి పరత్ర చ పరాంగితమ్
వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
అపరాధసహస్రాణి క్రియంతే అహర్నిశా
పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక
శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః!ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి!

సర్వోపచారాలు:
కింది మంత్రాలు చదువుతూ అక్షతలు స్వామివారి పాదాల వద్ద వేయండి.
 
ఓం శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః
ఛత్రమాచ్ఛాదయామి,చామరం వీచయామి,నృత్యం దర్శయామి,
గీతం శ్రావయామి,వాద్యం ఘోషయామి,అశ్వానారోహయామి,
గజానారోహయామి,శకటానారోహయామి,ఆందోళికానారోహయామి,
సమస్వరాజోపచార,శక్త్యుపచారపూజా సమర్పయామి

క్షమాప్రార్థన:

చేతిలో అక్షతలు తీసుకుని వాటిపై కొన్ని నీశ్లు వేసుకుని కింది శ్లోకాన్ని చదివి ఒక పళ్లెంలో అక్షతలు వదలాలి.
గణనాధుడి ముందు గుంజిళ్లు తీయాలి.తలపై మొటికలు వేసుకోవాలి.నేను చేసిన పూజలో మంత్రలోపము,
క్రియాలోపము,భక్తిలోపము ఉంటే అవన్నీ తొలగిపోవుగాక. మమ్ము అనుగ్రహించుగాక అంటూ గణపతిని మనం వేడుకుంటున్నాం.

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధాపా
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానమావహానాది షోడశోపచార పూజయాచ
అష్టోత్తర శతనామార్చనాయచ,అవసర,మహానివేదన యాచ
భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీమహాగణాధిపతి దేవతార్పణమస్తు
శ్రీమహాగణపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు

చివరిగా స్వామివారి ముందున్న పూజాక్షతలను మీ శిరస్సుపైన,కుటుంబసభ్యులందరి శిరస్సు పైన చల్లండి.పండుగనాటి
సాయంత్రం గణనాధుడికి పానకం,వడపప్పు,ఫలాలు సమర్పించండి.గణపతి అనుగ్రహం మీకు లభించుగాక.
వరసిద్ధివినాయకస్వామి పూజ ఇంతటితో సమాప్తం.

గమనిక:
మీ మీ సంప్రదాయాన్ని అనుసరించి...గణపతిని అదేరోజున సంధ్యాసమయంలో కానీ లేదా 3,5,7,9 వ రోజున కానీ
లేదా అనంతచతుర్థి రోజున కానీ కదిలించి మీ ప్రాంతంలోని బావి,చెరువు,నదిలో నిమజ్జనం చేయాలి.
విగ్రహాన్ని ఇంటిలోనే ఉంచకూడదు.మంగళవారం రోజున నిమజ్జనం చేయకూడదు.వినాయకుడు ఇంట్లో ఉన్నన్ని రోజులూ గణపతికి మీ శక్తిమేర పూజ చేయండి.నైవేద్యం సమర్పించండి.దీపారాధన చేయండి.అంతేకాని మీరు నిమజ్జనం చేసేవరకు ఎలాంటి పూజాధికాలు లేకుండా ఉంచవద్దు.


                            విఘ్నేశ్వరుని కథ

(పూజ పూర్తి అయిన తర్వాత కథను చదివే ముందు ఇంట్లో అందరూ చేతిలో అక్షతలు తీసుకుని కథను శ్రద్ధగా వినాలి.
కథ పూర్తి అయిన తర్వాత వినాయకని ప్రార్థంచి అక్షతలను వినాయకుని పై వేయాలి.)


ఓ రోజు నైమిశారణ్యంలో శౌనకుడు అనేక మంది మహర్షులను దర్శించుకున్నాడు.సత్సంగ కాలక్షేపం కోసం వినాయకుడి పుట్టుక,చవితి రోజు చంద్రుణ్ణి దర్శిస్తే వచ్చే దోషం,దాని నివారణ గురించి శౌనకుడు ప్రశ్నించగా సూతమహాముని తెలియచెప్పాడు.

పూర్వం ఏనుగు రూపంలో గజాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం గొప్ప తపస్సు చేసాడు.ఆ తపస్సుకి మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై"రాక్షసా!ఏమి నీ కోరిక?"ఏమి అని ప్రశ్నించాడు.

గజాసురుడు శివుణ్ణి భక్తితో అనేక రకాలుగా స్తుతించాక తన కోరికను చెప్పాడు."స్వామీ!నువ్వు ఎల్లప్ఫుడు నా కడుపులోనే నివాసం ఉండాలన్నాడు."

భక్తులకి తేలికగా ప్రత్యక్షమై,వారి కోరికలని ఇట్టే తీర్చి తనమీదకి ప్రమాదాలు తెచ్చుకొనే స్వభావంగల శివుడు గజాసురుడి పొట్టలోకి ప్రవేశించి హాయిగా 
నివసించసాగాడు.  

అక్కడ కైలాసంలో పార్వతీదేవి తన భర్త జాడ తెలీక ఆయన కోసం అన్వేషిస్తూ, ఆయన గజాసురుడి పొట్టలో ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుంది.
దాంతో పార్వతి విష్ణుమూర్తి దగ్గరకి ఏడుస్తూ వెళ్ళి జరిగింది చెప్పి, ఆయన సహాయం కోరింది.

"ఓ మహానుభావా!పూర్వం భస్మాసురుడినించి నువ్వు నా భర్తని రక్షించావు.అలాగే ఇప్పుడు నువ్వు గజాసురుడి బారినించి కూడా ఆయన్ని విడిపించి రక్షంచాలి."
శ్రీహరి ఆమెని ఊరడించాడు.
"శివుడు వాహనమైన నందిని నా దగ్గరికి పంపు.నీ కోరిక తీరుస్తాను.గజాసుర సంహారానికి గంగిరెద్దుల మేళమే తగినది."

బ్రహ్మని,ఇతర దేవతలందరినీ వెంటనే రావలసిందిగా విష్ణుమూర్తి కబురు పంపాడు.నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలకి తలో వాయిద్యం ఇచ్చి,తనూ చిరుగంటలూ సన్నాయిని అందుకుని,వారందరితో గజాసురుడి దగ్గరికి వెళ్ళాడు.

ఆ ఉళ్ళో,మనోహరంగా సాగే ఆ గంగిరెద్దు మేళాన్ని గురించి విన్న గజాసురుడు దాన్ని స్వయంగా చూసి ఎంతో వినోదించాడు. మేళం పెద్దయిన శ్రీహరితో చెప్పాడు.

"నరుడా!నీకేం కావాలో కోరుకో."

"అయ్యా! ఇది శివుడి వాహనమైన నంది. శివుని కోసం వచ్చింది.కాబట్టి దానికి ఆయన్ని చూపించు.తర్వాత మా దారిన  మేం  వెళతాం."

అది వినగానే గజాసురుడు ఉలిక్కిపడ్డాడు.తన పొట్టని చీల్చుకుని కానీ శివుడు బయటికి రాలేడు.వస్తే తనకు మరణం తప్పదు.దివ్యదృష్టితో గజాసురుడు ఆ కోరిక కోరింది శ్రీహరి అని తెలుసుకుని,ఇక తనకి చావు తప్పదని గ్రహించి తన కడుపులోని శివుణ్ణి ఇలా కోరాడు.

"స్వామి! నేను మరణించాక నా తలని మూడు లోకాలలో పూజించేలా చేయి. నా చర్మాన్ని నువ్వు ధరించు."శివుడు అందుకు అంగీకరించగానే,శ్రీహరి  నందికి సైగ చేసాడు.నంది తన కొమ్ములతో గజాసురుని కడుపు చీల్చి అతన్ని చంపేసింది.పొట్టనించి బయటపడ్డ శివునితో
శ్రీహరి చెప్పాడు.

"పరమశివా!దుర్మార్గులకి ఇలాంటి వరాలు ఇవ్వడం పాముకి పాలు పోయడంతో సమానం సుమా!"

బ్రహ్మని,ఇతర దేవతలని,వారి వారి లోకాలకి పంపించేసిన శ్రీహరి కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు.శివుడు నందిని ఎక్కి కైలాసానికి బయలుదేరాడు.

వినాయకుని జననం:
అతి త్వరలో తన భర్త తిరిగి కైలాసానికి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతి ఉత్సాహంగా తలంటు పోసుకోవడానికి తయారయింది.తన ఒంటిమీది
సున్నిపిండిని నలిపి తీసి,ఆ నలుగుపిండితో ఒక చిన్న పిల్లవాడి బొమ్మని చేసి దానికి ప్రాణం పోసి చెప్పింది.

"కుమారా!నువ్వు కాపలా ఉండి,లోపలికి ఎవరినీ రానీయక.
"ఆ బాలుడు అందుకు ఒప్పుకుని సింహద్వారం వద్దకి వెళ్ళాడు. పార్వతి  స్నానం ముగించుకుని,అనేక నగలని ధరించి,భర్తకోసం వేచి చూడసాగింది.

కైలాసం చేరుకున్న శివుడు లోపలకివెళ్ళబోతూంటే,పార్వతి కాపుంచిన పిల్లవాడు ఆయన్ని అడ్డగించాడు.శివుడికి కోపం వచ్చి ఆ పిల్లవాడి తలని తెక్కోసి లోపలికి వెళ్ళాడు.

పార్వతి శివుడికి ఎదురెళ్ళి,ఆహ్వానించి ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి,తాగడానికి నీళ్ళిచ్చి పతివ్రతాధర్మం ప్రకారం పూజించింది.

చాలాకాలం తర్వాత కలుసుకున్న వారిద్ధరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు.వారి సంభాషణలో ద్వారం దగ్గరి బాలుడి ప్రసక్తి వచ్చింది.పార్వతి జరిగింది 
చెప్పగానే శివుడు విచారిస్తూ చెప్పాడు.

"అయ్యో!నేను వాడి తలని నరికేశానే?"

ఇద్దరూ కొద్దిసేపు బాధపడ్డాక శివుడికి గజాసురుడికిచ్చిన వరం గుర్తుకొచ్చి, ఆ గజాసురుడి తలని తెచ్చి, మరణించిన ఆ బాలుడికి అతికించి, ప్రాణం పోసి చెప్పాడు.

"వత్సా!నీకు గజాననుడు అనే పేరు పెడుతున్నాను."

పార్వతి గజాననుణ్ణి ప్రేమగా పెంచుకోసాగింది.గజాననుడు కూడా తన తల్లి తండ్రులతో ప్రేమగా మెలుగుతూ పెరగసాగాడు.అనింద్యుడనే ఎలుకని తన వాహనంగా 
చేసుకుని దానిమీద తిరగసాగాడు.

మరికొంత కాలానికి పార్వతీ పరమేశ్వరులకి ఓ కుమారుడు పుట్టాడు.అతడికి "కుమారస్వామి"అనే పేరు పెట్టారు. మహాబలశాలి అయిన కుమారస్వామి నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు.

విఘ్నాలకి అధిపతి: 
ఓ రోజు అనేకమంది దేవతలు,మునులు,మానవులు పరమేశ్వరుడి  దగ్గరకి వచ్చి పూజించి చెప్పారు.
"స్వామీ! విఘ్నాలతో మా పనులు చాలా చెడిపోతున్నాయి. ఈ విఘ్నాలని శాసించేందుకుగాను మాకో అధిపతిని  ఇవ్వండి. ఆయన్ని పూజించి విఘ్నాలు కలగకుండా చూసుకుంటాము."

తన పిల్లలలో ఒకరికి ఆ ఆధిపత్యాన్ని ఇవ్వాలని శివుడు సంకల్పించాడు. అది తెలిసిన గజాననుడు తండ్రిని అడిగాడు.
"నేను పెద్ద కొడుకును కనుక ఆ ఆధిపత్యము నాకివ్వండి నాన్నగారు."

రెండో కొడుకు కుమారస్వామి తండ్రితో చెప్పాడు.
"నాన్నగారు!అన్నయ్య మరుగుజ్జు.అందుచేత అసమర్ధుడు,అనర్హుడు అవుతాడు. ఆ ఆధిపత్యం నాకివ్వండి."
వారి వాదనలని విన్న శివుడు వారితో చిరునవ్వుతో చెప్పాడు.
"పిల్లలారా!మీలో ఎవరు ముందుగా ముల్లోకాల్లోని నదుల్లో స్నానం చేసి నా వద్దకి వస్తారో వారిని అందుకు అర్హులుగా నిర్ణయించి,వారికి ఆధిపత్యాన్నిస్తాను. వెంటనే బయలుదేరండి."

ఆ మాటలు వినీ వినగానే కుమారస్వామి నెమలినెక్కి ఆ పనిమీద రివ్వున బయలుదేరాడు. వినాయకుడు తన ఎలుక వంక విచారంగా చూసి తండ్రితో చెప్పాడు.
"నాన్నగారూ!ఎలుకనెక్కి వెళ్ళి నేను తమ్ముడి కన్నా ముందుగా అన్ని నదుల్లో  స్నానం చేసి రాలేను.నేను ఈ పోటీలో గెలిచే ఉపాయం మీరే చెప్పండి".
అప్పుడు శివుడు కొడుకుతో చెప్పాడు.
"కుమారా!ఎవరు ఒకసారి నారాయణ మంత్రాన్ని జపిస్తారో వారు మూడు వందల కల్పాల కాలం,పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్యఫలాన్ని పొందుతారు."
"అలా అయితే ఆ మంత్రాన్ని ఉపదేశించండి.నాన్నగారూ".ఉత్సాహంగా అడిగాడు గజాననుడు.
 
తండ్రి ఆ మంత్రోపదేశం చేయగానే,గజాననుడు కైలాసంలో అత్యంత భక్తిగా ఆ మంత్రాన్ని స్మరించసాగాడు.

మొదటగా కుమారస్వామి గంగానదికి వెళ్ళగా,అప్పటికే గంగలో స్నానం ముగించి, ఎదురొస్తున్న అన్నయ్య గజాననుడు ఎదురుపడ్డాడు. అతనికి ఆశ్చర్యం వేసింది.
కుమారస్వామి మూడుకోట్ల ఏభై లక్షల నదుల్లో స్నానానికి వెళ్ళినా మంత్రమహిమ వల్ల గజాననుడు స్నానంచేసి ఎదురు రావడం కుమారస్వామికి కనిపించసాగాడు.
ఆఖరి స్నానం కూడా పూర్తిచేసి, ఎంతో ఆశ్చర్యంతో కుమారస్వామి కైలాసంలోని తండ్రి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపంతో చెప్పాడు.

"నాన్నగారూ!అన్నగారి మహిమ తెలీక ఇంచాక ఏదేదో మాట్లాడాను.నాకన్నా అన్నయ్యే అన్ని విధాలా సమర్ధుడు కనుక గజాననుడినే విఘ్నాలకి అధిపతి చేయండి."

ఆ ప్రకారం భాద్రపద శుద్ధ చవితినాడు పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం వేడుకని జరిపించాడు. అప్పటినించి అంతా విఘ్నేశ్వరుడికి పిలువబడే గజాననుడిని ఆరోజు పూజించి, వడపప్పు, పానకం, అరటిపండ్లు,తేనే,పాలు,కొబ్బరి,అతనికిష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు ఇతర పిండివంటలని నైవేద్యంగా పెట్టసాగారు.

ఆ భాద్రపద శుద్ధ చవితిన భూలోకంలో తనకి నైవేద్యం పెట్టిన వాటన్నిటినీ సుష్టుగా తిని విఘ్నేశ్వరుడు తన వాహనమైన ఎలుకకి కొన్ని పెట్టి కొన్ని చేతుల్లో తీసుకొని 
భుక్తాయాసంతో సూర్యాస్తమయ వేశకి మెల్లిగా కైలాసం చేరుకున్నాడు.

తల్లిదండ్రుల దగ్గరకెళ్ళి వంగి నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు.అయితే తిన్నవాటితో కడుపుబ్బిన వినాయకుడు నేలమీద బోర్లా పడుకొన్నాడు.పొట్టమీద నిలిచిన చేతులు భూమికి 
అందలేదు.బలవంతంగా చేతులని భూమికి ఆనిస్తే,కాళ్ళు పైకి లేకసాగాయి.

ఇలా సాష్టాంగ నమస్కారం చేయడానికి అవస్ధ పడే విఘ్నేశ్వరుడిని చూసిన శివుడి తలలోని చంద్రుడికి వినోదం కలిగి ఫక్కున నవ్వాడు.రాజదృష్టి సోకితే,రాళ్ళు కూడా 
పిండవుతాయంటారు.ఆ సామెత నిజమన్నట్టుగా వినాయకుడి పొట్ట పగిలి అందులోంచి ఉండ్రాళ్ళు,కుడుములు బయటికి వచ్చి నేలమీద దొర్లాయి.విఘ్నేశ్వరుడు మరణించాడు.

తక్షణం గర్భశోకంలో మునిగిన పార్వతి చంద్రుడి వంక కోపంగా చూసి ఈ విధండా శపించింది.

"దుర్మార్గుడా!నీ చూపు తగిలి నా కుమారుడు మ
రణించాడు కాబట్టి నిన్ను చూసిన వారంతా నీలాపనిందలతో బాధపడుదురు గాక!'

ఋషుల భార్యలకి ఆ శాపం తగులుట:
సరిగ్గా ఆ రోజు ఆ సమయంలో భూలోకంలో సప్తర్షులు ఓ యజ్ఞం చేస్తున్నారు.వారి భార్యలు అగ్ని ప్రదక్షణం చేస్తుండగా,అగ్ని దేవుడు ఆ ఏడుగురి మహర్షుల భార్యలని చూసి ప్రేమలో పడ్డాడు.
కాని వారిని ఏం చేయలేని వాడై,క్షీణింపసాగాడు.ఈ సంగతి  గ్రహించిన అగ్నిదేవుని భార్య అయిన స్వాహా దేవి భర్త కోరికని తీర్చాలనుకుంది.అరుంధతి తప్ప,మిగిలిన ఆరుగురి రూపాలని తన మహత్తుతో 
ధరించి అగ్నిదేవుడి కోరికని తీర్చింది.ఆ ఆరుగురు మునులు అది చూసి,తమ భార్యల శీలాన్ని శంకిచి వాళ్ళని వదిలేశారు.పార్వతి ఇచ్చిన శాపం వల్ల ఈ విధంగా చంద్రుణ్ణి చూసిన ఆ ఆరుగురు 
భార్యలమీద,తాము చేయని నేరం వచ్చి పడింది.
ఈ వివాదం శ్రీహరి దృష్టికి వచ్చింది.ఆయన తన దివ్యదృష్టితో జరిగింది గ్రహించి,ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడు.
"పార్వతీదేవి శాపం వల్ల ఇలా జరిగిందని మీరు నా ద్వారా తెలుసుకోగలిగారు.మరి నా సహాయం పొందలేని సామాన్యులకి కూడా మనం మేలు చేయాలికదా.పదండి."
శ్రీహరి అందరినీ వెంట తీసుకుని కైలాసానికి వెళ్ళాడు.కడుపు పగిలి మరణించి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి పార్వతికి సంతోషాన్ని కలిగించాడు.శ్రీహరి వెంట వచ్చిన వారంతా పార్వతిని ఇలా ప్రార్థించాడు.


"తల్లీ!పార్వతీ నువ్వు చంద్రుడికిచ్చిన శాపం వల్ల లోకులకి అనేక కష్టాలు వచ్చి పడుతున్నాయు.దయతో ఆ శాపాన్ని ఉపసంహరించి అందరినీ కాపాడు."
బ్రతికి వచ్చిన విఘ్నేశ్వరుడిని ముద్దు పెట్టుకుని పార్వతి తృప్తిగా చెప్పింది.
"సరే,ఏ రోజున చంద్రుడు మా అబ్బాయి విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజున మాత్రం చంద్రుడిని చూడకూడదు.చూస్తే,ఇలాంటి నీలాపనిందలు తప్పవు.మిగిలిన రోజుల్లో చూసిన ఏం కాదు."
బ్రహ్మ,ఇతర దేవతలు అది విని సంతోషించి,తమ తమ స్థానాలకి వెళ్ళారు.అప్పటినుంచి భాద్రపద మాస శుద్ధ చవితినాడు చంద్రుణ్ణి చూడకుండా ప్రజలు జగ్రత్తపడుతూ అంతా సుఖంగా జీవించ సాగారు.
ఇలా కొంత కాలం గడిచింది. 

శమంతకోపాఖ్యానం: 
ద్వాపర యుగం.
ఓ రోజు శ్రీకృష్ణుడు ద్వారకకి తనని చూడవచ్చిన నారదుణ్ణి భక్తిగా పూజించారు.ఇద్దరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు.సాయంసంధ్యా సమయంలో నారదుడు లేచి శలవు తీసుకుంటూ శ్రీ కృష్ణుడితో చెప్పాడు.
"స్వామీ!ఇవాళ భాద్రపద శుద్ధ చవితి.వినాయకుడి కారణంగా పార్వతి వల్ల ఇవాళ చంద్రుణ్ణి చూడరాదు.చూస్తే నీలాపనిందలు తప్పవు.కాబట్టి వెళ్ళొస్తాను.శెలవిప్పించండి?"

శ్రీకృష్ణుడికి ఆ శాప విషయాన్ని వివరించి నారదుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు.దాంతో శ్రీకృష్ణుడు ఆ రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడరాదని పట్టణంలో చాటింపు వేయించాడు.

పాలంటే ఇష్టం గల శ్రీకృష్ణుడు ఆ రాత్రి బయటికివచ్చి,తలెత్తి ఆకాశం వంక చూడకుండా గోశాలకిపోయి పాలు పితుకుతుంటే,పాలగిన్నెలో చంద్రుడి ప్రతిబింబం కనిపించింది.
"ఆహా!చూడకూడని దినాన చంద్రుణ్ణి చూసానుకదా.ఆ శాప ఫలితంగా నాకేం నీలాపనిందలు రానున్నాయో"అనుకున్నాడాయన.
ఇలా కొంత కాలం గడిచింది.శ్రీకృష్ణుడి రాజ్యంలో సత్రాజిత్తు అనే అతనుండేవాడు.అతను సూర్యుణ్ణి పూజించి,శమంతకమణిని సంపాదించాడు.అతనో రాజు శ్రీకృష్ణుడిని చూడటానికి ద్వారకకి వచ్చాడు.
శ్రీకృష్ణుడు అతనికి తగిన మర్యాదలు చేసాక,ఆ శమంతకమణి ప్రసక్తి రాగానే కృష్ణుడు దాన్ని తనకిమ్మని సూచించాడు.

"అమ్మో!ఇది రోజుకి ఎనిమిది బారువుల బంగారాన్నిస్తూంటుంది.ఇంత విలువైన మణిని ఎలా ఇస్తాను?"అంటూ తిరస్కరించాడు సత్రాజిత్తు.
"సరే నీ ఇష్టం,"అన్నాడు కృష్ణుడు.
మరికొంత కాలం గడిచాక సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడా శమంతక మణిని మెళ్ళోధరించి,వేటాడటానికి వెళ్ళాడు.ఓ సింహం ఆ మణిని చూసి అది మాంసం ముక్క అని పొరబడి ప్రసేనుడి మీదకి ఉరికి చంపేసింది.

ఆ మణిని నోటకరుచుకుని వెళ్ళే ఆ సింహాన్ని ఓ మగ ఎలుగుబంటి చూసి దానిని చంపింది.ఆ మణితో తన నివాస స్థలానికి వెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆ మణిని ఆడుకోవడానికిచ్చింది.

వేటకి వెళ్ళి తిరిగి రాని తమ్ముడు కోసం సత్రాజిత్తు అడవికి మనుషులని పంపితే మణిలేని అతని శరీరం వారికి కనిపించింది.వ
వారంతా వెంటనే వచ్చి ఆ సంగతి చెప్పారు.సత్రాజిత్తు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి ఆ మణిని దొంగిలించాడని భావించి నగరమంతా చాటింపు వేయించాడు.
 
ఈ సంగతి శ్రీకృష్ణుడికి తెలిసింది.భాద్రపదశుద్ధ చవితినాడు తాను పాలలో చంద్రుని ప్రతి బింబాన్ని చూడటం వల్ల వచ్చిన నీలాపనిందగా దాన్నిగుర్తించాడు.బంధు మిత్రులతో వెంటనే శ్రీకృష్ణుడు అడవికి
వెళ్ళి ప్రసేనుడి శవాన్ని,పక్కనే వున్న సింహాపు కాలి గుర్తులని చూశాడు.వాటిననుసరించి వెళ్తే,అక్కడ చచ్చి పడివున్న సింహాన్ని పక్కన గల ఎలుగబంటి పాదాల గుర్తులని గమనించాడు.
ఆ కాలి గుర్తులను అనుసరించి వెళ్తే,అవి పర్వతంలోని గుహద్వారం దాకా వెళ్ళాయి.తన వెంట వచ్చిన వారిని అక్కడే వుండమని శ్రీకృష్ణుడు ఒంటరిగా ఆ గుహలోకి వెళ్ళాడు.

గుహలోని ఊయలకి ఆట వస్తువుగా కట్టి వున్న శమంతకమణిని చూసి,దాన్ని తీసుకుంటూండగా శ్రీకృష్ణుడిని చూసిన జాంబవతి భయపడింది.
"నాన్నా ఎవరో వింత మనిషి నా మణిని తీసుకుంటున్నాడు చూడు."అని గట్టిగా అరిచింది.
జాంబవంతుడు కోపంతో వచ్చి శ్రీకృష్ణుడిని చూసి,అతని పైబడి కోరలతో కొరుకుతూ,గోళ్ళతో గుచ్చుతూ చంపడానికి ప్రయత్నించాడు.
శ్రీకృష్ణుడు ఆ ఎలుగుబంటిని కిందకి తోసి రాళ్ళతోనూ,వృక్షలతోనూ,పిడి గుద్ధలతోనూ ఎదుర్కొన్నాడు.అలా ఇరవై ఎనిమిది రోజులపాటు వారిమధ్య యుద్ధం సాగింది.
క్రమేపి జాంబవంతుడి బలం క్షీణించింది.దెబ్బలుతినడం వల్ల అతని దేహమంతా నొప్పులే.తన బలాన్ని క్షీణింపజేయగలిగింది రావణుని చంపిన శ్రీరామ చంద్రుడే అని గ్రహించాడు జాంబవంతుడు.
వెంటనే శ్రీకృష్ణునికి నమస్కారం చేస్తూ,భక్తితో కూడిన వినయంతో చెప్పాడు.
"దేవాదిదేవా!నువ్వు త్రేతాయుగంలో రావణుడు,ఇతర దుష్టరాక్షసులను చంపడానికి అవతరించిన శ్రీరామచంద్రుడవని అర్థమైంది.ఓ సారి నువ్వు నా మీద ప్రేమతో ఏదైనా వరం కోరుకోమంటే,బుద్ధిమాలి మీతో ద్వంద్వయుద్ధం
చేయాలని చెప్పాను.సమయం వచ్చినప్పుడు అది జరుగుతుందని నువ్వు చెప్పావు.అప్పటినించి,అనేక యుగాలుగా నీ నామాన్నే స్మరిస్తూన్నాను.నా ఇంటికే వచ్చి నువ్వు నా కోరికని తీర్చావు.ధన్యుడిని.నా శరీరం అంతా నలిగి
బాధగావుంది.నువ్వే నన్ను దయతో కాపాడు."
శ్రీకృష్ణుడు జాంబవంతుడి వంక దయగాచూస్తూ తన చేత్తో శరీరాన్ని ఓ సారి నిమిరాడు.అంతే!జాంబవంతుడి బాధలన్నీ మాయం అయి పూర్వపు శరీరాన్ని పొందాడు.అప్పుడు శ్రీకృష్ణుడు తను వచ్చిన పనిని జాంబవంతుడికి వివరించాడు.
"జాంబవంతా!నేను శమంతక మణిని దొంగిలించానని నా మీద అభియోగం వచ్చింది.నాకా మణినిచ్చి నేనా అపనిందని పోగొట్టుకునేలా చెయ్యి."
"స్వామీ!అలాగే.ఈ మణే కాక,నా కూతురు జాంబవతిని కూడా నీ భార్యగా నీకు సమర్పిస్తున్నాను.దయచేసి స్వీకరించు."కోరాడు జాంబవంతుడు.

అలా జాంబవంతుడికి అల్లుడై,శ్రీకృష్ణుడు గుహలోంచి మణి,భార్యామణితో బయటికి వచ్చాడు.శ్రీకృష్ణుడికేమైందో అని బయట ఆదుర్దాగా వేచి వున్న వారంతా బాధ పడుతున్నారు.అతన్ని చూడగానే వారంతా ఆనందంతో జయజయధ్వానాలు చేసారు.

కృష్ణుడు అందరితో కలిసి తన నగరానికి వెళ్ళి,సత్రాజిత్తుని పిలిచి,శమంతకమణిని అతనికిచ్చి,ఆ మణి ఎలా మాయమైందో వివరించాడు.
"అయ్యో!లేనిపోని నింద మీ మీద మోపి తప్పు చేసాను. "అని సత్రాజిత్తు బాధపడ్డాడు.
తన తప్పిదానికి పరిహారంగా సత్రాజిత్తు తన కుతురు సత్యభామని శ్రీకృష్ణునికి భార్యగా,ఆ శమంతక మణితో పాటు ఇచ్చారు.కృష్ణుడు మణిని తిరస్కరించి,సత్యభామని మాత్రం స్వీకరించాడు.
ఓ శుభ ముహుర్తాన శ్రీకృష్ణుడు,సత్యభామలకి వివాహం జరిగింది.ఆ వివాహానికి వచ్చిన దేవతలు,మునులు శ్రీకృష్ణుడితో మొర పెట్టుకున్నారు.
"మహాత్మా!మీరు సమర్ధులు కాబట్టి చవితి నాడు చంద్రుడిని చూడగా మీ మీద వచ్చిన అపనిందలు తొలగించుకో గలిగారు.మాలాంటి అసమర్ధుల మాటేమిటి?మీరే తగిన పరిష్కారం చెప్పాలి."

కృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్పాడు.
"మీరు ప్రతీ ఏడూ భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజించి,గణపతి పుట్టుక నించి,ఈ శమంతకోపాఖ్యానం దాకా మొత్తం కథ విని,లేదా చదివి అక్షింతలు తలమీద చల్లుకుంటే,ఆ రాత్రి చంద్రుని చూసినా ఎవరికీ ఎలాంటి నీలాపనిందలూ కలగవు.
ఈ రోజు నుంచి వినాయకుడు విఘ్నాలకు అధిపతియేకాక ,గణాలకి కూడా అధిపతి అవుతాడు కాబట్టి గజాననుణ్ణి ఇకనుంచి విఘ్నేశ్వరుడు,గణాధిపతి అనే పేర్లుతో కూడా పిలువబడతాడు."
అది విన్న అందరూ సంతోషించారు.అప్పటినుంచి ప్రతి సంవత్సరం భాద్రపదశుద్ధ చవితినాడు దేవతలూ, మహర్షులు,మానవులు మొదలైన వారంతా తమ శక్తి కొలది వినాయకుడిని పూజించి ఈ కథ విని లేదా చదివి సుఖంగా వున్నారు.
సూత మహాముని ఈ కథని శౌనకుడు,ఇతర మునులకి చెప్పాక,వారి దగ్గర శెలవుతీసుకుని తన నివాసస్థానికి వెళ్ళాడు.

                              ఓం విఘ్నేశ్వరాయ నమః
లోకంలోని సమస్త ప్రాణకోటికి శుభం కలుగుగాక వినాయక వ్రత కల్పం సమాప్తం 







      










కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి